వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర.. | - | Sakshi
Sakshi News home page

వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర..

Feb 11 2024 2:02 AM | Updated on Feb 11 2024 10:43 AM

- - Sakshi

ప్రజాహిత యాత్రలో ఎంపీ సంజయ్‌

కరీంనగర్: ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రతీ నిమిషం ప్రజల్లోనే ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యరద్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. శనివారం మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా అంబేడ్కర్‌, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కుటుంబానికి సైతం సమయం ఇవ్వకుండా తన నియోజవర్గ ప్రజలతో మమేకమై ప్రతీ సందర్భంలోనూ వెన్నంటి ఉన్నానని గుర్తు చేశారు.

పార్లమెంట్‌ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి ఎంపీగా ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేడిపల్లి–గోవిందారం రోడ్డుకు రూ.22కోట్లు, గోవిందారం బస్టాండ్‌కు రూ.15 లక్షలు, వెంకట్రావ్‌పేటకు రూ.20 లక్షలు, దేశాయిపేటకు రూ.20లక్షలు, తొంబర్రావుపేట, పోరుమల్ల, కొండాపూర్‌, మేడిపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు మేడిపల్లి మండలానికి చేసిందేమీ లేదన్నారు. ‘బండి సంజయ్‌ ఏం చేశాడు’ అని మాట్లాడుతున్న నేతల నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర అని చెప్పారు. అనంతరం ప్రజాహితయాత్ర మండలంలోని కొండాపూర్‌, రంగాపూర్‌, భీమారం, మన్నెగూడెం నుంచి రాత్రి 10 గంటల వరకు కథలాపూర్‌ మండలం సిరికొండ గ్రామానికి చేరింది.

కాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్డు నిర్మాణంతో తాము నష్టపోతున్నామని, అలైన్‌మెంట్‌ మార్పించాలని పలు వురు రైతులు సంజయ్‌కు వినతిపత్రం ఇచ్చారు. యాత్రలో నారాయణఖేడ్‌, హుస్నాబాద్‌ బీజేపీ నాయకులు సంగప్ప, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు మొరపల్లి సత్యనారాయణ, ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కథలాపూర్‌లో ఘనస్వాగతం
కథలాపూర్‌ మండలం బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ప్రజలను పలకరిస్తూ.. నమస్కరిస్తూ ఎంపీ సంజయ్‌ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామంలో బ్యాంక్‌ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ నాయకుడు చెన్నమనేని వికాస్‌రావు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: పూట గడవడమూ కష్టమే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement