● మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి
పట్టణాభివృద్ధిని అడ్డుకోవడం, మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో దౌర్జన్యానికి దిగడమే ధ్యేయంగా బీజేపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి విమర్శించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధి కోసం 35 అంశాలతో సమన్యాయంగా ఎజెండా రూపొందించినా వాటిపై చర్చించకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సమావేశం ప్రారంభం కాకముందే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండా ప్రతులను చించివేసి, మైకులు విసిరేస్తూ హంగామా చేశారన్నారు. మహిళా చైర్పర్సన్ అని చూడకుండా పోడియంపైకి వచ్చి దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతి సమావేశాన్ని కావాలనే రసాభాస చేస్తూ పట్టణాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా బీజేపీ సభ్యులు తమ తీరును మార్చుకోవాలని, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు షేరు, మహేశ్, మోతీలాల్, బబ్లూ, జావేద్, తహసీనున్నిసా, గంగాధర్, వనిత, లలిత, సావిత్రి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


