కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీవ్ర గందరగోళం, నిరసనల నడుమ ఎ జెండా అంశాలపై చర్చలు జరగకుండానే వాయిదా పడింది. చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన సా ధారణ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 35 అంశాలతో సిద్ధం చేసిన ఎజెండాపై చర్చను ప్రారంభించగానే బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఎజెండా అంశాలలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంట్రాక్టర్ల బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తూ ప్రతిపక్ష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శానిటైజేషన్, చెత్త ట్రాక్టర్ల కొనుగోలు, రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు, నిర్వహణ అంశాలపై ముందుగా చర్చించాలని పట్టుబట్టారు. పోడియం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కాసేపు అధికార పక్షం కాంగ్రెస్, మిత్రపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు గంటలపాటు ఎజెండా అంశాలపై కాకుండా సమావేశం రసాభాసగా సాగింది. ఎజెండా అంశాలపై చర్చిద్దామని, పట్టణాభివృద్ధికి సభ్యులు సహకరించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. భోజన విరామం అనంతరం సమావేశం ప్రారంభంతో బీజేపీ కౌన్సిలర్లు మళ్లీ నిరసన తెలపడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతునాయక్, టీపీవో వినిత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు వదిలేసి బిల్లులకే
ప్రాధాన్యం ఇచ్చారన్న బీజేపీ కౌన్సిలర్లు
పోడియం ఎదుట బైఠాయించి నిరసన
వాయిదా వేసినట్లు ప్రకటించిన
చైర్పర్సన్ ఉమారాణి


