ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
అంగన్వాడీ, పాఠశాల తనిఖీ
● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్
గోలి శ్రీనివాస్ రెడ్డి
● కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్ష
కామారెడ్డి క్రైం: ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి శుక్రవారం ఆయన కమిషన్ సభ్యులు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, జ్యోతిలతో కలిసి విచ్చేశారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం–2013 అమలు, అమలవుతున్న పథకాలపై క్షేత్ర పర్యటనలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. రేషన్ దుకాణాల పనితీరు, ఆహారధాన్యాల కేటాయింపు, లిఫ్టింగ్ పంపిణీ విధానం, పారదర్శకత చర్యలను సమీక్షించారు. సామాజిక తనిఖీలు, విజిలెన్స్ కమిటీల పనితీరు, గోదాముల పరిస్థితి, నాణ్యత సంరక్షణ చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధు మోహన్, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, డీడబ్ల్యూవో ప్రమీల, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ పాఠశాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.అనంతరం కాలభైరవుడి దర్శించకుని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్కు ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ, వంశీకృష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తహసీల్దార్ ఉమాలత, సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, ఉన్నారు.


