విప్లవోద్యమంలో సమీక్ష అవసరం
● ‘సాక్షి’తో ప్రొఫెసర్ జి.హరగోపాల్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘రాజ్యం బలీయంగా మారింది. టెన్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ వేట సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవోద్యమంలో సమీక్ష అవసరం ఉందని పౌరహక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హింసను నిలువరించాలని పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయన్నారు. తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో అప్పట్లో కేంద్ర బలగాలు ముప్పై మందిని చంపాయి. ఇప్పుడు మళ్లీ జల్లెడ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కాల్చి చంపుతోందన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ విషయంలో జోక్యం చేసుకుని దేశ వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడం సరికాదన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ నేత కే.వేణుగోపాల్ ఉన్నారు.
విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఉద్యమ నేత, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని, విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం కార్పొరేట్ రంగానికి కొమ్ముకాసేలా ఉందని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వికసిత భారత్ శిక్షా అభియాన్ బిల్లును అడ్డుకోవాలని కోరారు. విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు విజయరామరాజు, నాయకులు విఠల్ తదితరులు పాల్గొన్నారు.


