కరప: కారు అడుగు భాగంలో చుట్టుకున్న ఎండుగడ్డితో మంటలు రేగి, కారు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన ఓ పాస్టర్ తన కారులో మరో ముగ్గురితో కలిసి రావులపాలెంలో జరిగే క్రైస్తవ సమావేశానికి బయలుదేరారు. మార్గం మధ్యలో కారు అడుగుభాగాన ఎండుగడ్డి చుట్టుకుంది. ఆ విషయాన్ని పాస్టర్ గమనించలేదు. కరప మండలం పెద కొత్తూరు గ్రామం వద్దకు వచ్చేసరికి వెనుక వస్తున్న మోటార్ సైక్లిస్ట్ వారిని ఆపాడు. కారు నుంచి మంటలు వస్తున్నాయని చెప్పి, అప్రమత్తం చేశాడు. కారు బ్రేక్ పనిచేయకపోవడంతో హ్యాండ్ బ్రేక్ వేసి పాస్టర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురూ బయటకు వచ్చేశారు. అనంతరం మంటలు కారు టైర్లు, సీట్లకు వ్యాపించారు. వాటిని చూసి సమీపంలోని గృహాల వారు బయటకు పరుగులు తీశారు. పెద కొత్తూరు గ్రామస్తులతో పాటు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు స్పందించి కాకినాడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.


