సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు పొడవడంతోనే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, డైవర్షన్ పాలిటిక్స్తో నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుపై సమరశంఖం పూరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అడుగడుగునా ప్రజలను వంచించేందుకు కుట్రలు, కుతంత్రాలే అజెండాగా సాగుతున్న కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ముందున్నదంతా ఇక పోరుబాటేనని ప్రకటించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్లెట్లను పార్టీ జిల్లా నేతలతో కలసి కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత భావాలను వ్యక్తం చేసినా.. పోలీసులను అడ్డం పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వెన్నుపోటుకు నిరసనగా.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకూ దశలవారీ ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టోను దహనం చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై యువత, రైతులు, మేధావులు, బాధితులు, మహిళలతో ఈ నెల 8న నియోజకవర్గ కేంద్రాల్లో ఇండోర్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు జనం విసుగెత్తిపోయారన్నారు. వివిధ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఇస్తున్న పిలుపునకు స్పందించి, ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు తరలి వస్తూండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ అందించిన జనరంజక పాలనను కాదని.. అధికారం కోసం కూటమి కట్టి వచ్చిన పార్టీలకు పట్టం కట్టి చాలా తప్పు చేశామనే అభిప్రాయంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అన్నారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాజా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ జిల్లా బూత్ కమిటీల పర్యవేక్షకుడు ఒమ్మి రఘురామ్, యువజన విభాగం గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ తోట శ్రీరాంజీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026
ఫ సమరశంఖం
పూరించేందుకు ప్రజలు సిద్ధం
ఫ 4న మండల కేంద్రాల్లో
టీడీపీ మేనిఫెస్టో దహనం
ఫ 8న నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు
ఫ 12న నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు
ఫ వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
ఫ ‘చంద్రబాబు వెన్నుపోటుకు
రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ


