బోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కరప: ఉదయమంతా ఉక్కపోత, వేడిగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వాన జల్లులతో సేద తీరారు. కాకినాడ నగరంతో పాటు కరప మండల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ, వేడి గాలులతో ఆపసోపాలు పడ్డారు. ఈ తరుణంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, కరపలో పగలే చీకటిగా మారింది. ఉన్నట్టుండి చల్లని గాలులతో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. చిన్నారులు బయటకు వచ్చి, కేరింతలు కొట్టారు. అయితే, వర్షం కారణంగా కాకినాడలోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.


