అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విద్యుత్ సమస్యపై సాక్షి దినపత్రికలో ఆదివారం ‘రత్నగిరి పై కరెంటు కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ తూర్పు డివిజన్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఫృథ్వీతేజ్ స్పందించి, కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ నాణ్యమైన విద్యుత్నే దేవస్థానానికి సరఫరా చేస్తోందని దేవస్థానం కేబుల్స్లోనే సమస్య ఉండ వచ్చునని సీఎండీకి విద్యుత్ శాఖ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ జీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. విద్యుత్ సమస్యను దేవస్థానం అధికారులే పరిష్కరించుకోవాలని దేవస్థానం సబ్స్టేషన్ కు నిర్ధేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. దీంతో దేవస్థానంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యకు కారణమెవరు అనే దానిపై గందరగోళం ఏర్పడింది.
విద్యుత్ విజిలెన్స్
అధికారుల తనిఖీలు
దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య పై అటు దేవస్థానం, ఇటు విద్యుత్ శాఖ అఽధికారులు భిన్న వాదనలు వినిపిస్తుండడంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు దేవస్థానంలో విద్యుత్ సరఫరాపై తనిఖీలు చేయాలని విద్యుత్ విజిలెన్స్ అధికారులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీరాజ్ ఆదేశించారు. దీంతో సోమవారం విజిలెన్స్ అధికారులు రత్నగిరి సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరాపై తనిఖీలు నిర్వహించారు. లో వోల్టేజీ సమస్య పై దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులు రత్నగిరి సబ్ స్టేషన్లో ఉమ్మడిగా మంగళవారం తనిఖీలు నిర్వహించనున్నారు.


