● మట్టి మాఫియా మాయాజాలం
● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
పి.మల్లవరం పంచాయతీ రాంజీనగర్
రహదారిలో మట్టి ట్రాక్టర్ నడుపుతున్న బాలుడు
పి.మల్లవరంలో జేసీబీని ఆపరేట్ చేస్తూ
ట్రాక్టర్లో మట్టిని వేస్తున్న బాలుడు
తాళ్లరేవు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు.. మట్టిని తరలిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు దొరక్క బాలురతో ట్రాక్టర్లను నడిపించేస్తున్నారు. ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ట్రాక్టర్లతోపాటు భారీ వాహనాలైన జేసీబీలను కూడా పట్టుమని పదేళ్లయినా నిండని పిల్లలతో డ్రైవింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం పి.మల్లవరం పంచాయతీ పెదపేటలో మట్టిని ట్రాక్టర్లతో తరలించారు. ఆ మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపే జేసీబీ డ్రైవర్ ఒక బాలుడు కావడం గమనార్హం. 14 ఏళ్ల లోపు ఉండే ఆ బాలుడు ప్రమాదకర రీతిలో జేసీబీని ఆపరేట్ చేయడాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. సాధారణంగా 18 ఏళ్లు దాటితేనే తప్ప టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయరు. అలాంటిది 14 ఏళ్ల లోపు బాలుడు జేబీసీని ఆపరేట్ చేయడం గమనార్హం. మట్టి ట్రాక్టర్లను కూడా లైసెన్స్లేని బాలురు నడుపుతున్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.


