పనులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయింపు
కొత్తపల్లి: తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాగులాపల్లికి చెందిన ఉపాధి కూలీలు ఆందోళన నిర్వహించారు. కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మండల రైతు కూలీ సంఘం నాయకుడు గుర్రాల అప్పారెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో తీసుకొచ్చిన విబిజి రాంజీ పథకం ఉద్దేశం ఉపాధి పనులను తగ్గించడమేనన్నారు. వంద రోజుల పని దినాలను 120 రోజులుగా పెంచుతామని చెప్పినా నిధులు మాత్రం కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నాగులాపల్లి పనులు చూపించకపోవడంతో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొత్త పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని, ఫేస్ యాప్ను రద్దు చేయాలని డిమాండు చేశారు. కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలన్నారు. ఆందోళన చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వస్తే ఉపాధి పని కల్పిస్తున్నామంటూ ఆందోళనను చేపట్టరాదంటూ అధికారులు ఫోన్ చేసి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఐటీయూ నాయకులు కే.నాగేశ్వరావు, రైతు సంఘాల నాయకులు జి.వెంకట సుబ్బారెడ్డి, అబ్బిరెడ్డి అప్పారావు, నేరెళ్ళ రెడ్డి, పి.సత్యన్నారాయణ పాల్గొన్నారు.
రెండు వారాలు కూడా
పని కల్పించలేదు
ఈ సంవత్సరంలో సుమారు రెం
డు నెలలు పూర్తవుతున్నా రెండు వారాలు కూడా ఉపాధి పనులు కల్పించలేదు.
– పి.సుబ్బిరెడ్డి, ఉపాధి కూలి నాగులాపల్లి
అధికారులు నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తున్నారు
ఉపాధి కూలీల పట్ల ఉపాధి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్ధితి ఏర్పడింది. పనులు కల్పించే వరకూ ఆందోళన విరమించేది లేదు.
– కె.అప్పన్న, ఉపాధి కూలి నాగులాపల్లి.


