● ఎండలు, ఈదురు గాలులు,
భారీ వర్షంతో ప్రజల బెంబేలు
● తునిలో నేల కొరిగిన చెట్లు
● మామిడి రైతులకు నష్టం
తుని/తుని రూరల్: భానుడు ఓ వైపు, వరుణుడు మరో వైపు, వాయుదేవుడు ఇంకోవైపు ప్రజలను అల్లాడిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఉదయం నిప్పు కొలుమిలా భానుడు మాడుస్తుంటే, సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షంతో వరుణుడు భయపెడుతున్నాడు. పట్టణంలోని కొబ్బరితోట, పార్కు సెంటర్, అమ్మాజీపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆ శాఖ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. చెట్లు కూలిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, డీఈఈ సతీష్ సత్వర చర్యలు చేపట్టి వాటిని తొలగిస్తున్నారు. పక్వానికి వచ్చిన మామికాయలు రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు తొండంగి తీరప్రాంతంలో బోటు విరిగిపోయింది. తలుపులమ్మతల్లి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో వారు ఆందళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో దేవస్థానం సిబ్బంది, రూరల్ పోలీసులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కారుపై పడిన కొమ్మలను తొలగించి భక్తులను రక్షించారు.


