బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం జూన్ 5న ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా జూన్ 5 నుంచి 14వ తేదీ వరకూ బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేసి, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారన్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారని, వీటిపై జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులు, అభ్యంతరాలను జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ ఈఆర్ఓలు పరిశీలించి, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈఆర్ఓలు తిరస్కరించిన వాటిపై కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. జూలై ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.


