జెడ్పీటీసీలకు ప్రొటోకాల్ ఏదీ?
● చంద్రబాబు సర్కార్లో వారికి విలువ శూన్యం
● రహదారులు అధ్వానంగా ఉన్నా చర్యలు లేవు
● వాడీవేడిగా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జెడ్పీటీసీలకు ప్రోటోకాల్ పాటించడం లేదని సభ్యులు ఎంపీడీఓల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు పద్దు ప్రవేశపెట్టారు.
జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించరా?
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీడీఓలు జెడ్పీటీసీలను ఆహ్వానించడం లేదని సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు, గొల్లపల్లి రత్నం, ఒమ్మి బిందుమాధవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా అమలయ్యేదని, ఇప్పుడు తమను గౌరవించడం లేదని వారు ధ్వజమెత్తారు. దీనిపై అధికారులను నిలదీసినా సరైన సమాధానం రావడం లేదన్నారు. దీనిపై జెడ్పీ చైర్పర్సన్ స్పందిస్తూ ప్రొటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మెట్ట ప్రాంతంలో మూడు నియోజకవర్గాలు, నాలుగు మండలాల ప్రజలకు ఉపయుక్తంగా ఉన్న సత్యసాయి తాగునీటి పథకాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీటీసీలు మట్టా శైలజ మాట్లాడుతూ తాము జెడ్పీటీసీలుగా ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ప్రజలకు ఏ మేలూ చేయలేకపోయామన్నారు. మంజూరైన అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 45 కోట్ల వరకు పనులు కేటాయించి, 15 కోట్లు పనులను తొలగించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా లేక ఇబ్బందులు
గత ఖరీప్లోను, ప్రస్తుత రబీలోను రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు సమావేశంలో మండిపడ్డారు. పి.గన్నవరంలో రైతులకు యూరియా సక్రమంగా అందడం లేదని స్థానిక నాయకులు కూపన్లు ఇచ్చిన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని వాపోయారు. పిఠాపురం మండలంలో యూరియా సక్రమంగా అందడం లేదని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు నిలదీశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా అర్హులైన రైతులందరికీ అందడం లేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పంటనష్టం సంభవిస్తే నెలలోపు రైతు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసేవారన్నారు. గత ఖరీప్లో పంట నష్టం సంభవించినా ఎటువంటి పరిహారం ఇంకా అందలేని జేడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. తాము పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని జేడీఏ ఎన్.విజయ్కుమార్ తెలిపారు.
రహదారులు అధ్వానం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రహదారులపై ప్రయాణం చాలా కష్టంగా ఉందని, అధికారులు ఎప్పుడు అడిగినా రోడ్డు నిర్మిస్తామని చెప్పడం తప్ప పనులు జరగడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రహదారుల నిర్మాణం ప్రారంభిస్తామని రోడ్లు భవనాలు శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.
జెడ్పీ బడ్జెట్ ఆమోదం
2025–26 సంవత్సరానికి రూ.43 లక్షల మిగులుతో రూ.1,019 కోట్ల సవరణ బడ్జెట్ను, 2026–27 సంవత్సరానికి రూ.45 లక్షల మిగులుతో రూ.2712.65 కోట్ల అంచనా బడ్జెట్ను ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ సర్వ సభ్య సమావేశం ఆమోదించింది. 2025–26 సవరణ బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.249 లక్షలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.99 లక్షలు, సీ్త్ర శిశు సంక్షేమానికి రూ.249 లక్షలు, తాగు నీటి సరఫరాకు రూ.199 లక్షలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమానికి రూ.165 లక్షలు, అభివృద్ధికి రూ.381 లక్షల నిధులు కేటాయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, డీఆర్వో వెంకట్రావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడుతున్న మహిళా జెడ్పీటీసీ సభ్యులు
సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులు
జేడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు
జెడ్పీటీసీలకు ప్రొటోకాల్ ఏదీ?
జెడ్పీటీసీలకు ప్రొటోకాల్ ఏదీ?


