సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం రత్నగిరిపై రామాలయం ముందున్న ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక్కడ పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ తుని తపోవనం స్వామీజీ సచ్చిదానంద సరస్వతి బుధవారం ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించనున్నారు. అనంతరం, భక్తులనుద్దేశించి సంక్రాంతి విశిష్టతపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తారు. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భోగి మంట, జానపద కళారూపాల ప్రదర్శనలకు రత్నగిరిపై ఏర్పాట్లు చేశారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తాటాకులతో వేసిన గుడిసె, కొబ్బరి, ఈత, తాటి చెట్లు, తామర, కలువ పూలతో కూడిన కొలను, ధాన్యపు రాశి, నుయ్యి, రచ్చబండ, కోడిపుంజులు, ఎడ్లబండి, పొట్టేలు, ఆవు దూడ వంటి కళారూపాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల సాయిబు, జంగమ దేవర, కొమ్మదాసరి తదితరులు కూడా సందడి చేయనున్నారు. సత్యదేవుని వార్షిక కల్యాణ వేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఆలయం, రాజగోపురాలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలు, పుష్పమాలికలతో అలంకరిస్తున్నారు. భోగి పండ్లు వేసేందుకు గాను ఉదయం 9 గంటలకు చిన్నారులను సంక్రాంతి వేడుకల వద్దకు తీసుకుని రావాలని అధికారులు కోరారు. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు సంక్రాంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
భోగి మంటకు చేసిన ఏర్పాట్లు
సంక్రాంతి సంబరాలకు రత్నగిరిపై సిద్ధమైన ప్రాంగణం
ఫ భోగి మంట వెలిగించనున్న
తపోవనం స్వామీజీ
ఫ సర్వాంగసుందరంగా
ఆలయ ప్రాంగణం ముస్తాబు
సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు
సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు


