
ప్రయాణం.. ప్రయాసం
మలికిపురం: రెండు జిల్లాల మధ్య గోదావరి నదిపై గల దిండి– చించినాడ వంతెనపై రాకపోకలు నిషేఽధించిన ప్రభుత్వం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయింది. సుమారు 3 నెలల పాటు రాకపోకలు నిషేధం అంటూ పదిరోజుల క్రితం ప్రకటించిన అధికారులు విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు. వంతెన మరమ్మతులకు నిధులు కేటాయింపుపై కూడా దృష్టి పెట్టలేదు. సుమారు 20 ఏళ్లుగా ఇక్కడ వంతెనపై రాకపోకలకు అలవాటు పడిన ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని రాజోలు దీవి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో గల విద్యాసంస్థలకు అనేక బస్సులు తిరుగుతున్నాయి. ఈ దీవి నుంచి సుమారు 3 వేలకు పైగా విద్యార్థులు బస్లలో విద్యాసంస్థలకు వెళ్తారు. సుమారు 100కు పైగా బస్లు ఉన్నాయి. అయితే వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో ఆయా విద్యా సంస్థలు బస్లను దిండి వైపే నిలిపి వేస్తున్నాయి. సుమారు 2 కిలోమీటర్ల పొడవు గల వంతెనపై విద్యార్థులు నడుచుకుంటూ చించినాడ వైపు వెళ్తున్నారు. సాయంత్రం కూడా చించినాడ వరకే బస్లు నడుపుతున్నారు. అటువైపు నుంచి విద్యార్థులు నడుస్తునూ ఇవతలి వైపునకు వస్తున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం నడక విద్యార్థులకు భారంగా మారింది. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
పట్టించుకోని విద్యాసంస్థలు
తేలిక పాటి వాహనాలకు అనుమతి ఉండడంతో ఆయా విద్యాసంస్థలు ఆటోలను ఏర్పాటు చేయవచ్చు. కానీ అలా చేయడంలేదు. ఫీజులు దండీగా వసూలు చేసే ఆయా విద్యాసంస్థలు ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్లు అటువైపు, ఇటువైపు కూడా నిలిపి వేసి ప్రయాణికులకు వంతెనపై నడకే దిక్కు అంటున్నారు. ప్రయివేటు బస్లు కూడా చించినాడ వరకే పరిమితం కావడంతో మలికిపురం, రాజోలు, అమలాపురం నుంచి వచ్చే బస్లు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులను రాజోలు దీవి నుంచి మోటార్ సైకిళ్లపై చించినాడ తీసుకెళ్లవలసి వస్తోంది. ఇక ఉపాధి కోసం అటు నుంచి వచ్చి వెళ్లే కార్మికులు ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వంతెనకు ఇరువైపులా భారీ వాహనాలు, బస్లు నిలిపి ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఽఅధికంగా ఉంది. ఈ కష్టాలు ఎన్నాళ్లు ఉంటాయో అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిండి– చించినాడ వంతెనపై
రాకపోకలు నిషేధం
ప్రత్యామ్నాయం చూపని అధికారులు
విద్యార్థులకు నడక యాతన
ట్రక్కుల పైనే కార్మికుల ప్రయాణం
ఇంకా మొదలు కాని మరమ్మతులు
అంచనాలు కూడా రూపొందించని వైనం
విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం
దిండి వంతెనపై బస్ల రాకపోకల నిషేధించడం వల్ల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యా సంస్థల బస్లు వంతెన అటు వైపు, ఇటు వైపు నిలిపివేసి వంతెనపై విద్యార్థులను నడిపిస్తున్నారు. ఆటోలు పెట్టి ఇబ్బందులను తొలగించాలి, అధికారులు జోక్యం చేసుకోవాలి.
– బూశి జాన్ మోషే, విశ్వేశ్వరాయపురం.

ప్రయాణం.. ప్రయాసం

ప్రయాణం.. ప్రయాసం