● ‘లిటిల్ టీచర్స్–లిటిల్ లీడర్స్’ వినూత్న కార్యక్రమం ద్వారా గుర్తింపు
కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. బడి గంటకొట్టంగానే ఇంటికి వచ్చామా.. అన్న తరహాలో విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ గట్టు మండలంలోని తప్పెట్లమొర్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న అగస్టీన్ మాత్రం పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంలో ముందుంటాడు. ‘లిటిల్ టీచర్స్–లిటిల్ లీడర్స్’ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులలో భాషా, తార్కిక మరియు జీవన నైపుణ్యాల పెంపుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా నో బ్యాగ్డే కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం ప్రారంభించారు. పీర్గ్రూప్ లెర్నింగ్ (సమూహ అభ్యసనం) ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా, పాఠశాలలో వందశాతం హాజరు శాతం నమోదైన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానిస్తూ వారిని ప్రోత్సాహిస్తుంటారు. రెండేళ్ల కిందట కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తుప్పుడు పర్యావరణహిత బయోపాట్స్, వినాయక విగ్రహాలను వేరుశనగ పొట్టుతో తయారు చేసే విధానాన్ని నేర్పించి జాతీయ స్థాయిలో ఇన్నోవేషన్ (సీఎస్ఐఆర్) అవార్డు కూడా సాధించారు. అవార్డు పొందిన విద్యార్థిని శ్రీజ స్టార్టప్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శనం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావిధానాలు అమలు చేస్తున్న ఫిన్లాండ్ను సందర్శించేందుకు ఇటీవల రాష్ట్రం తరఫున ఎంపికై న 28 మంది ఉపాధ్యాయుల బృందంలో అగస్టీన్ సభ్యుడిగా ఉన్నారు.


