పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో గురువారం అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టే సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూం ఓపెన్చేసి.. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలులోకి తీసుకురావాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా చేపట్టాలన్నారు. వార్డుల వారీగా ఆయా పోలింగ్స్టేషన్ల బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత టేబుల్ వద్ద ఓపెన్ చేసి.. ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కట్టి సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా తిరస్కరించబడిన బ్యాలెట్ పేపర్ల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరితే నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ నిఘాలో చేపట్టనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఉన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్


