పట్టణం ఎవరికో..
ఎవరి లెక్కలు వారివే..
మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
● ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
● అంచనాలకు అందని నడిగడ్డ ఓటరు నాడీ
● ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ
● ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నిప్పటికీ.. ఓటరు ఇచ్చిన తీర్పు శుక్రవారం మధ్యాహ్నానికి వెలువడనుంది. అప్పటి వరకు పార్టీల నాయకులు, అభ్యర్థులు, రాజకీయ విశ్లేషకులకు ఉత్కంఠ తప్పదు. మరికొన్ని గంటల్లో కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో శుక్రవారం తేలిపోనుంది. పుర పోరులో నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీపడిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. అయితే ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే మల్లగుల్లాలు ప్రధాన పార్టీల నేతల్లో మొదలైంది. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడ్డారు. అయిజ, అలంపూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఽమధ్యే పోటీ కొనసాగింది. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఫార్వార్డ్బ్లాక్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు స్ట్రాంగ్రూముల్లో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే దానిపైనే చర్చ సాగుతోంది.
గద్వాల మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో హోరాహోరీ పోరు నెలకొనగా.. చాలా వరకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓటువేసిన అనంతరం ఎవరికి వేశారో కూడా అంతర్గత చర్చలో బయటపెట్టేందుకు ఆసక్తి చూపకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ రకాల తాయిళాలు, లిక్కర్, నగదు పంపిణీ విచ్చలవిడిగా చేపట్టినప్పటికీ.. ఓటరు నాడీని పసిగట్టలేదు. సర్వే ఏజెన్సీలు, మీడియా గ్రూపుల ద్వారా సమాచారాన్ని సేకరించి.. ఫలితాలపై విశ్లేషణలు చేస్తుస్తున్నారు. మరోవైపు వార్డుల్లో పోలైన ఓట్లు.. అందులో కులాలు, మతాల వారీగా లెక్కలు వేసుకుంటూ ఫలితాలను అంచనా వేయడంలో తలమునకలయ్యారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఒకింత అనుకూలత ఉన్నప్పటికీ.. చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ సంఖ్య దక్కేనా అనే మీమాంసలో విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ సైతం గట్టిపోటీ ఇచ్చామని.. వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల్లో తామే కింగ్ మేకర్ కానున్నామని అంతర్గత విశ్లేషణలు చేసుకుంటున్నారు. 14 వార్డుల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండగా.. మరో 20 వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అదే విధంగా మరో మూడు వార్డుల్లో స్వతంత్రులు సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు.
● అలంపూర్, అయిజలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఇక్కడ కూడా తమకే చైర్మన్ పీఠం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. వార్డుల వారీగా పడిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గతంలో వచ్చిన ఫలితాలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఫార్వార్డ్బ్లాక్ పార్టీల మధ్య పోటీ సాగింది.


