రైతుల మేలుకే యూరియా యాప్
ఇటిక్యాల: రైతుల మేలు కోసమే ప్రభుత్వం యూరియా యాప్ తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కోదండాపురం గ్రామ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా యాప్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత సమాచారం ఎప్పటికప్పడు రైతులు తెలుసుకొని తమకు నచ్చిన చోట తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. దీని ద్వారా రైతులకు యూరియా పారదర్శకంగా, సక్రమంగా అందుతుందన్నారు. ప్రసుత్తం జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి మండలంలో రైతులకు కావాల్సినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే సబ్సిడీపై స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్, ఏఓ సురేష్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
ధరూరు/ గద్వాల: విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతతోపాటు శుచి, శుభ్రతగా ఉండాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి.. వంటగది, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. వంట ఏజెన్సీ మహిళలు బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి వండాలన్నారు. బియ్యంలో పురుగులు, మట్టి పెల్లలు, రాళ్లు వంటివి లేకుండా చూసుకొని వండాలన్నారు. వంట కోసం తీసుకువచ్చిన సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పాఠశాల జీహెచ్ఎం ప్రతాప్రెడ్డికి సూచించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులు కావాలన్నారు. పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, ఈ కొద్ది రోజులు బాగా చదవాలన్నారు. అలాగే స్పషల్ క్లాస్ల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గట్టు మండలంలోని మాచర్ల ఉన్నత పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి.. తరగతి గదులు, టింకరింగ్ ల్యాబ్, వాటర్ ప్లాంటు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ కృష్ణమోహన్, తహసీల్దార్ నరేందర్, హెచ్ఎం రఘు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల మేలుకే యూరియా యాప్


