● జాతీయ లోక్అదాలత్తో సత్వర న్యాయం
భూపాలపల్లి అర్బన్: ప్రజలకు ఉచితంగా, సత్వర న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ జీవన్కుమార్ తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, మోటార్ వాహన ప్రమాదాలు, కుటుంబ వివాదాలను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగడం వల్ల సమయం, డబ్బు వృథా కావడంతోపాటు మనశ్శాంతి దెబ్బతింటుందన్నారు. ఇరువర్గాలు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వచ్ఛందంగా రాజీకి రావాలని సూచించారు. జాతీయ లోక్అదాలత్లో భాగంగా ఒక్కరోజులోనే 40 సివిల్, 1,055 క్రిమినల్, 50 బ్యాంకు రికవరీ, 21 సైబర్ క్రైమ్, 2,212 ట్రాఫిక్ చలానా కేసులు పరిష్కరించారు. మొత్తంగా 3,378 కేసులకు ముగింపు పలికారు. లోక్అదాలత్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య భూ వివాదం కూడా పరిష్కారమైంది. భూపాలపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన కేసులో ఇరువర్గాలు రాజీకి రావడంతో కేసును పరిష్కరించారు. కాటారం పోలీస్స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య 2024లో నమోదైన కేసులోనూ రాజీ కుదిరింది. మూడేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగిన దంపతులు కేసును విరమించుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి, న్యాయమూర్తులు ఎస్.ఆర్.దిలీప్కుమార్ నాయక్, జి.అఖిల, ఆర్డీఓ పోరిక హరికృష్ణ, ప్రభుత్వ న్యాయవాది బొట్ల సుధాకర్, డీఎస్పీ సంపత్రావు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


