న్యూస్రీల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
భూపాలపల్లి: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో భారత్లో గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జిల్లాలో గృహావసరాలకు మినహా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. ఫలితంగా జిల్లాకేంద్రంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయగా, పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.
డబుల్ అయిన గ్యాస్ బుకింగ్..
జిల్లాలో హెచ్పీ, భారత్, ఇండేన్ కంపెనీలకు చెందిన 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల్లో డొమెస్టిక్(గృహావసర) కనెక్షన్లు 1,32,330 ఉన్నాయి. ఆయా వినియోగదారులు గతంలో నెలకు సుమారు 1,500 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే వారు. యుద్ధ వాతావరణం నేపథ్యం, గ్యాస్ కొరత తీవ్రం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు 2,800 నుంచి 3వేల మంది సిలిండర్ల కోసం బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకరోజుకు జిల్లాకు సుమారు 2వేల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ సిలిండర్ల కొరత కొంతమేరకు మాత్రమే ఉంది. బుకింగ్ చేసుకున్న వారు ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు..
వంటగ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో జిల్లాకేంద్రంతో పాటు కాటారం డివిజన్ కేంద్రంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు గ్యాస్ సిలిండర్లు లేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పలు రెస్టారెంట్ల యజమానులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదనే ఉద్ధేశంతో వంటచెరుకును ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. కట్టెలను కొనుగోలు చేసి హోటల్, రెస్టారెంట్ సమీపంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
రీసైక్లింగ్ షురూ..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో కొందరు వ్యాపారులు కొత్త దందాకు దిగినట్లు సమాచారం. గృహావసరాల సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.1,800 వరకు కొనుగోలు చేసి కమర్షియల్ సిలిండర్లలోకి రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని పలు షాపుల యజమానులు సైతం డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి రీసైక్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రోజుకు 3వేల గ్యాస్ సిలిండర్ల బుకింగ్
వ్యాపార సంస్థలకు కమర్షియల్
గ్యాస్ నిలిపివేత
మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు
పలుచోట్ల కట్టెల పొయ్యితో
వంటల తయారీ


