నేడు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

నేడు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

Apr 30 2025 12:19 AM | Updated on May 2 2025 2:39 PM

భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయంలో నేడు(బుధవారం) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పోచమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని మూడు రోజులుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం హోమం, కుంకుమార్చన, సాయంత్రం శట్కోనం పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. నేడు ఉదయం 9 గంటలకు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

ఏరియాలో పర్యటించిన సెక్యూరిటీ జీఎం

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ జీఎం లక్ష్మినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఏరియాలోని సింగరేణి భూములు, ఖాళీ స్థలాలు, బొగ్గు నిల్వలు, సోలార్‌ ప్లాంట్‌ భద్రతలను పరిశీలించి, సీసీ కెమెరాలను పర్యవేక్షించి రికార్డులను తనిఖీచేశారు. బొగ్గు దొంగతనం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్‌తో చర్చించారు. స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.

విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి

భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ కిరణ్‌ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై పింగలి అమరేందర్‌రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పూలమాలవేసి, శాలువాతో సత్కరించి గృహోపకరణాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీస్‌ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు నగేష్‌, రత్నం, కిరణ్‌, శ్రీకాంత్‌, అమరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి వర్క్‌పీపుల్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏరియాలోని అంబేడ్కర్‌ స్టేడియంలో మంగళవారం ఉచిత వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జ్‌ ఎస్‌వోటు జీఎం పోశమల్లు హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల పిల్లలు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా పిల్లలు సెల్‌ ఫోన్‌, టీవీలకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. 

సెల్‌ఫోన్‌ ద్వారా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, అరుణ్‌ప్రసాద్‌, యూనియన్‌ నాయకులు బేతెల్లి మధుకర్‌రెడ్డి, మోటపలుకుల రమేష్‌, సీనియర్‌ పీఓ శ్రావణ్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, కోచులు తిరుపతి, రఘువీర్‌, శరత్‌, నెహ్రూ, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement