భూపాలపల్లి అర్బన్: ఏరియా వర్క్షాపు ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్ను నియమించినట్లు బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఫిట్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్, ఎలక్ట్రిషన్ సేఫ్టీ కమిటీ సభ్యులుగా జి.కొమురయ్య, రమేష్, పిల్లి రవి, వర్క్ కమిటీగా కరుణాకర్, శ్రీనివాస్, గరిగ రమేష్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, విజేందర్, రవికుమార్ పాల్గొన్నారు.
ఫార్మసిస్టుల హర్షం
భూపాలపల్లి అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్టుల హోదాను ఫార్మసీ ఆఫీసర్స్గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న ఫార్మసిస్టు గ్రేడ్–2లను ఫార్మసీ ఆఫీసర్స్గా, ఫార్మసిస్టు గ్రేడ్–1లను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్స్గా, ఫార్మసీ సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్స్గా మార్పు చేస్తూ ఈ నెల 25వ తేదీన జీఓ జారీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు.
వృత్తి విద్య కోర్సులకు శిక్షణ
భూపాలపల్లి అర్బన్: జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నిషియన్, వెల్డింగ్ అండ్ ప్రాబ్సికేషన్ టెక్నిషియన్, ఆటోమొబైల్ అండ్ టూ వీల్లర్స్, ఎక్సకవేటర్ ఆపరేటర్, ఫుడ్ బెవరేజీస్ అసిస్టెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ హోటల్ మేనేజ్మెంట్, ఆఫీసర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ఫీల్ట్, టెక్నిషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు నెలల శిక్షణ, భోజన వసతి సదుపాయం, నిపుణుల ద్వారా సాఫ్ట్ స్కిల్ శిక్షణ, శిక్షణ పొందిన అనంతరం ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోసం సంబంధిత కోర్సులో విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల వారు ఏరియాలోని ఎంవీటీసీ కార్యాలయంలో సంపద్రించాలన్నారు.
సర్వే పనుల అడ్డగింత
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకపోతే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సునీత, ఆర్ఐ శివరామ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియామకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో చేసుకున్నారు.
అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియో(అర్చక)తో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంథనికి చెందిన కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ అవధాని మోహన్శర్మకు పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్