
అవే సమస్యలు..
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
భూపాలపల్లి: ప్రజావాణికి భూ సమస్య, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వినతులే వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే స మస్యలు కూడా కలెక్టరేట్కే వస్తున్నాయి. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్ సెల్లో మొత్తం 52 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ కల్పించాలి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఎక్కడా అమలు కావడంలేదు. రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజావాణిల్లో దరఖాస్తులు ఇస్తున్నా. కనీసం ఒక్క జిల్లాలో అమలు చేసి పదిమందికి అవకాశం ఇచ్చినా నా ఉద్యమానికి ఫలితం దక్కుతుంది.
– కట్ట ప్రసాద్, జాతీయ దివ్యాంగుల
హక్కుల న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు
డ్రిప్ సామగ్రి సరిగా ఇవ్వలేదు
నాకున్న ఎనిమిది ఎకరాల్లో 2022–2023 సంవత్సరంలో పామాయిల్ తోట సాగు చేసిన. సబ్సిడీపై డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. డ్రిప్ కంపెనీ వారు ఓ రోజు రాత్రి నా వ్యవసాయ భూమి దగ్గర సామగ్రి దించిపోయారు. తెల్లవారుజామున చూస్తే అందులో మొత్తం సామగ్రి లేదు. దీంతో అధికారులు, డ్రిప్ కంపెనీ వారిని అడిగితే ఎవరూ స్పందించలేదు. నా సొంత డబ్బులతో పనులు చేయించుకున్న. హార్టికల్చర్ అధికారులపై చర్య తీసుకోవాలి.
– సామల వెంకటేశ్వర్లు,
చల్లగరిగె, చిట్యాల
భూమి, పింఛన్ సమస్యలే ఎక్కువ
గ్రీవెన్స్లో 52 వినతులు
దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు: కలెక్టర్ రాహుల్ శర్మ

అవే సమస్యలు..