సకలవిద్యార్థి సమీకృతం!
కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట విద్యాబోధన
జఫర్గఢ్: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్య యంతో మండలంలోని ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న 161/సీ/2 సర్వే నంబర్లోని 21 ఎకరాల సువిశాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ పనుల నిర్మాణానికి గతేడాది మార్చి 16న సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వర్చువల్గా శంకుస్థాపన చేయగా, ఈ నెల 10న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లోగా పూర్తి చేసేందుకు గడువు విధించింది. .
ప్రత్యేకతలివే..
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒకే గొడుగు కింద ఏర్పాటు కాబోతున్నాయి. ఒకే చోట 2,560 మంది విద్యను అభ్యసించనున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలకు చెందిన విద్యార్థులు ఈ సమీకృత భవన ప్రాంగణంలో చదువుకోనున్నారు. ఈ పాఠశాల భవనంలో వివిధ బ్లాకులుగా విద్యాబోధన అందించనున్నారు. ఒక్కో బ్లాక్కు 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. భాషకు సంబంధించిన ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇండోర్ యాక్టివిటీ జోన్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, విస్తృత క్రీడామైదానాలు, మూడు బ్లాక్లలో 10 (ల్యాబ్లు) ప్రయోగశాలలు, 10 డిజిటల్ కూబికల్స్తో కల్గిన లైబ్రరీలు, విద్యార్థులు పలు అంశాలపై చర్చించుకునేందుకు చర్చా గదులు వీటితో పాటు పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, ఉద్యానవనాలు, జిమ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
ఆధునిక వసతి సదుపాయాలు
5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రెండంచెల బంకర్ పడకలు, 9, 12వ తరగతి విద్యార్థులకు ఒకే అంచె మంచాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 1,280 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే ఆధునిక హంగులతో కూడిన భోజనశాల, 8 పడకల సామర్థ్యం కల్గిన అరోగ్య సంరక్షణ కేంద్రంతో పాటు తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక లాంజ్ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక నివాస సముదాయాలు
విద్యార్థులతో పాటు విద్యా బోధన అందించేందకు జీ ప్లస్ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది, వసతి గృహ వార్డెన్ల కోసం ప్రత్యేకంగా భవన సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమీకృత పాఠశాల భవనంలో మొత్తంగా 86 మంది సిబ్బందికి వసతులు కల్పించనున్నారు.
విద్యా హబ్గా ఘన్పూర్ నియోజకవర్గం
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంతో పాటు జఫర్గఢ్ మండలం వి ద్యాహబ్గా మారనుంది. ఘన్పూర్ నుంచి జఫర్గ ఢ్ వచ్చే రహదారిలో చేపడుతుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.
ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
కార్పొరేట్కు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు
కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మాణం కాబోతున్న సమీకృత
గురుకులం
విద్యాహబ్గా మారనున్న
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం
సకలవిద్యార్థి సమీకృతం!


