ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి 9వ తరగతుల వరకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంటు(ఎస్ఏ)–2 పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. పరీక్షలను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాదేశిక సంయుక్త సంచాలకుడు, జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు పంపినట్లు అందులో పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మార్కులు ఆన్లెన్ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. 23వ తేదీన ప్రకటించనున్న ఫలితాల అనంతరం, అదే రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలని స్పష్టంగా ఆదేశించారు.
బుగులు వెంకన్న ఆలయానికి లాకర్ అందజేత
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం స్టేషన్ఘన్పూర్కు చెందిన గూడూరు జగన్నాథం జ్ఞాపకార్థం కుమారుడు నరేందర్–మంజుల దంపతులు రూ.1.10 లక్షల విలువైన లాకర్ అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన దాతలు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు సమక్షంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ పాల్గొన్నారు.
‘పీఎం అజయ్ యోజన’ కు కన్నాయిపల్లి ఎంపిక
రఘునాథపల్లి: మండలంలోని కన్నాయిపల్లి గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పీఎం అజయ్ యోజనకు (పీఎం అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన) జిల్లాలో ఒక్క గ్రామం మాత్రమే ఎంపికై ంది. దీని ద్వారా 15వ ఫైనాన్స్ నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసి వంద శాతం సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అదనంగా పీఎం అజయ్ యోజన పథకం కింద ఎంపిక చేయడంపై సర్పంచ్ లోనె అంజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రతీ ఇంటికి సర్వే చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
డీసీసీ అధ్యక్షుల జాతీయస్థాయి శిక్షణలో ధన్వంతి
జనగామ: రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల జాతీయ స్థాయి ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మి నారాయణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పది రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. డీసీసీ పదవి హోదా కాదని, అది ప్రజల పట్ల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకున్నందుకు సీఎం రేవంరెడ్డి అభినందించినట్లు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు
ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు


