దేవాదుల సమస్యలు పరిష్కరించండి
జనగామ: జనగామ నియోజకవర్గంలో సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలకమైన దేవాదుల ప్రాజెక్ట్ 8వ ఫేజ్ ప్యాకేజీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం నివేదించారు. వివిధ గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రాజెక్టు ఆలస్యానికి సంబంధించిన కారణాలను తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ 8వ ప్యాకేజీలో అత్యవసరంగా పరిష్కారం చేయాల్సిన అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు. నియోజకవర్గంలో సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంటల ఉత్పాదకత తగ్గిపోతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంచేశారు. దేవాదుల ప్రాజెక్ట్లో భాగంగా ధర్మసాగర్ లింక్ కాలువ గండిరామవరం గ్రామ పరిధిలో నాలుగు నెలలుగా నిలిచిపోయిందని, ఈ పని పూర్తికాకపోతే నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గండిరామారం నుంచి నుంచి కన్నెబోయినగూడెం, బొమ్మకూరు రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకుసాగకుండా ఉన్నాయని, వెంటనే నిర్మాణ సంస్థలను వేగవంతమైన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కన్నెబోయిన గూడెం నుంచి నుంచి లద్నూరు, తపాస్పల్లి వరకు మిగిలిన పైప్లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, పైన్ ప్యాకేజీ లో కాలువల నిర్మాణం సరిగా జరగకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందన్నారు. భూసేకరణ, చెల్లింపుల సమస్యలకు పరిష్కారం చూపించడంతో పాటు యథావిధిగా నడపడం వల్ల 80 శాతం నీటిపారుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. మిగిలిన 20 శాతం ఆయకట్టు అందుబాటులోకి రావాలంటే 530 ఎకరాల భూమికి సంబంధించిన చెల్లింపులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాలకు లిఫ్ట్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదని, మల్లన్నసాగర్ నుంచి టీఎస్పీఎల్ కాలువ పనులు కూడా నిలిచిపోయిన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి


