రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగడంలో మైక్రో అబ్జర్వర్లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పోలింగ్ బూత్లో జరిగే మొత్తం ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశితంగా పరిశీలించాలన్నారు. జనరల్ అబ్జర్వర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమన్నారు. కాగా, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, నోడల్ అధికారి హౌజింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు.


