ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంపై సమీక్ష
జఫర్గఢ్: జఫర్గఢ్ మండలంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల నిర్మాణంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డిజైన్, మౌలిక వసతులు, పనుల పురోగతి, పూర్తి చేసే గడువు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 10వ తేదీన పాఠశాల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ గణపతిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


