ధర్మపురి: ధర్మపురిలోని శ్రీమహాగణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణలతో స్వామి వా రికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి
జగిత్యాలరూరల్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, హస్నాబాద్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేందుకు నడుం బిగించాలని పేర్కొన్నారు. ప్రజలు రక్షిత మంచినీటిని తీసుకోవాలన్నారు. సర్పంచులు గంగాధర్, గంగవ్వ, ఎంపీడీవో విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, మండల వ్యవసాయాధికారి వినీల పాల్గొన్నారు.
డీఎఫ్వో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
జగిత్యాలక్రైం: కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మొయినోద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఏసీబీ సీఐ పొన్నం చందర్ జిల్లా అటవీశాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ కేసు విషయమై ఫైల్తోపాటు, డీఎఫ్వో నుంచి పలు వివరాలు సేకరించారు. ఏసీబీకి పట్టుబడిన ఎఫ్ఆర్వో ఈ కేసులో డీఎఫ్వో పేరు కూడా అధికారులకు తెలిపినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనం, పరిశుభ్రతకు సహకరించాలి
కథలాపూర్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని డీపీవో మదన్మోహన్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని తాండ్య్రాలలో గ్రామసభ నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, వర్షాకాలంలో ఇళ్ల సమీపంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. దోమలు వృద్ధి చెంది అనారోగ్యం బారిన పడే ప్రమాదముందన్నారు. సర్పంచ్ శివానీ, ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రమేశ్, ఎంఈవో శ్రీనివాస్, ఏవో యోగితా, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి, ఏపీఎం చిన్నరాజయ్య పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలక్రైం:రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భా గంగా ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు అ న్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతపై గ్రామస్తులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ వినియోగించాలన్నారు. యువత మత్తుపదార్థాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు.


