ఎద్దు, ఎవుసం తెలియని సీఎం | - | Sakshi
Sakshi News home page

ఎద్దు, ఎవుసం తెలియని సీఎం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

● మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్‌, జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డికి ఎద్దు, ఎవుసం తెలియదని, కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే తెలుసని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌ మాటలకు.. చేతలకు పొంతన లేదని, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ.. ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడుతూనే.. మోటార్లకు మీటర్లు పెడితే ఓటు అడగననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చే కుట్రలో భాగమే ఇదంతా అని పేర్కొన్నారు. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయని కాంగ్రెస్‌కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. జిల్లాలో ఇసుక దోపిడీ సాగుతుందని, ఆరపెల్లి, దొంతాపూర్‌, ధర్మపురిలో క్వారీలకు అనుమతించే అవకాశం ఉన్నా ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కో ట్రాక్టర్‌కు రూ.8వేలు వసూలు చేస్తున్నారని, ఇందులో ధర్మపురి సీఐకి రూ. 5వేలు, మంత్రికి రూ.3వేలు వెళ్తున్నాయని ఆరోపించారు. మార్పుకోరుకున్న ప్రజలు.. రాష్ట్రం దోపిడీ పాలవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను కనుమరుగు చేసేందుకే రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన మాటలకు రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, పుప్పాల అశోక్‌, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement