జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రతి సీజన్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వరి కోయించిన తర్వాత రైతులు వరి మొదళ్లు(కొయ్యకాళ్లను) కాల్చేస్తున్నారు. దీంతో పంటభూమికి ఉపయోగం లేకపోగా.. ఆ మంటల్లో విలువైన పైపులు, డ్రిప్పైపులు, కరెంట్ వైర్లు, కరెంట్ మోటార్లు, స్టార్టర్లు, ఈత, తాటి వనాలు కాలిపోయి భారీగా నష్టపోతున్నారు. వేసవిలో నిప్పు పెడితే జరిమానా విధిస్తామని ఇటీవల జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
నష్టమే ఎక్కువ..
గతంలో పంట అవశేషాలు (చెత్తాచెదారం, పత్తి కట్టె, వరి కొయ్యకాళ్లు) కాలబెట్టకుండా వర్షాలు పడగానే సాగు భూమిలోనే దున్నేవారు. ప్రస్తుతం ఒక్క అగ్గిపుల్ల గీసి కాల్చేస్తున్నారు. అనంతరం పంట దిగుబడి కోసం బస్తాల కొద్ది రసాయన ఎరువులు కుమ్మరిస్తున్నారు. కాని ఫలితం మాత్రం కనబడటం లేదు. ఈ నేపథ్యంలో రైతులను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.


