కేవీకి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

కేవీకి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయింపు

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

● జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారులోని సర్వేనంబరు 437లోని స్థలాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని తెలిపారు. కేవీకి ఆరెకరాలు కేటాయించామన్నారు. ఇప్పటికే రూ.33 కోట్లతో ఐటీఐ, ఈఏటీఏ సెంటర్‌ తెచ్చామని, వృద్ధాశ్రమాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని వెల్ల డించారు. చల్‌గల్‌లోని వాలంతరి భూములు 12ఎకరాలు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు కేటాయించామన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు బండ శంకర్‌, సమిండ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. 10 నుంచి 15శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.59 లక్షల టన్నులు కేంద్రాలకు వస్తే.. 3.29 లక్షల టన్నులు కొన్నామని తెలిపారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. త్వరలోనే 100 శాతం కొనుగోలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ లత, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement