జగిత్యాలటౌన్: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులపై సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో మదన్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గోవుల రవాణాను అరికట్టండి
గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ కేంద్రంగా వ్యాపారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. చిల్వాకోడూర్ నుంచి అక్రమంగా కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు కంటైనర్లు, డీసీఎంలు, బొలెరో వాహనాల్లో పరిమితికి మించి గోవులను తరలిస్తూ క్రూరంగా వధిస్తున్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టి గోమాతను రక్షించాలి.
– హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు
సంతకం చేయకుండా
వేధిస్తున్నాడు
మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాను. అంతకు ముందు 23 ఏళ్లు జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాను. 2024లో ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. హైకోర్టును ఆశ్రయించగా నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపాల్ కక్ష పూరితంగా రిలీవింగ్ సంతకం చేయడం లేదు. దీంతో నా జీతభత్యాలు నిలిచిపోయాయి. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చిరుద్యోగినైన నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – జక్కుల లక్ష్మి, అటెండర్


