జగిత్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. పెట్రో ధరలను నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పాతబస్టాండ్ సమీపంలోని ఓల్డ్ హైస్కూల్ నుంచి ర్యాలీగా తరలివచ్చి తహసీల్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో చార్జీలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయన్నారు. ప్రధాని మోదీ జపిస్తున్న పొదుపు మంత్రం దేశ ఆర్థిక అస్తిరతకు నిదర్శనమన్నారు. ఇప్పటికై నా కేంద్రం దిగివచ్చి పెట్రో ధరలు తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనకపోవడం వారి మైత్రికి నిదర్శనమన్నారు. దశాబ్ద కాలంపాటు కేసీఆర్ను ఎన్నో రకాలుగా విమర్శించిన జీవన్రెడ్డి ఇప్పుడు అదే కేసీఆర్ను దేవుడు అనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పెట్రో ధరలు తగ్గించడంతో పాటు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఆర్డీవో మధుసూదన్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. వెలమ సంక్షేమ మండలి చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిండ్ల వాణి, బండ శంకర్ పాల్గొన్నారు.


