46.3 డిగ్రీల ఉష్ణోగ్రత | - | Sakshi
Sakshi News home page

46.3 డిగ్రీల ఉష్ణోగ్రత

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

● 1694 గ్రాముల గంజాయి స్వాధీనం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఆదివారం 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 46.3, ధర్మపురి మండలం నేరెళ్లలో 46.2, కోరుట్ల మండలం అయిలాపూర్‌, ధర్మపురి మండలం జైనాలో 46.1, సారంగాపూర్‌, ఎండపల్లి మండలం గుల్లకోట, రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 45.5, ఎండపల్లి మండలం మారేడుపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొండగట్టులో భక్తుల రద్దీ

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. స్వామివారిని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘు, రాము, చిన్నరాము, అభిలాష్‌, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ తూము శ్రీనివాస్‌, ఏఎస్సై శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గంజాయి విక్రేతల అరెస్ట్‌

జగిత్యాల క్రైం: జగిత్యాలరూరల్‌ మండలం చల్‌గల్‌ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు. చల్‌గల్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన తాటిపాముల వంశీ, రాయికల్‌ మండలం అయోధ్య గ్రామానికి చెందిన మొండె అనిల్‌ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 1694 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితోపాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు

జగిత్యాలరూరల్‌: జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేట శివారులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇందిరమ్మ ఇళ్ల చుట్టూ వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో రైతుల వ్యవసాయ మోటార్ల వైర్లు, గ్రామానికి మంచినీటి సరఫరా అయ్యే విద్యుత్‌ మోటార్‌ కాలిపోయింది. పొగ దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్డు పక్కన చెట్లు దగ్ధం

మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో పెట్రోల్‌బంక్‌ సమీపంలో రోడ్డు పక్కన చెట్లు, ఈతచెట్లు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

చదువుతోనే మంచి జీవితం

జగిత్యాలటౌన్‌: చదువుతోనే చక్కని జీవితం సాధ్యమని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. గోప (గౌడ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌) ఆధ్వర్యంలో టెన్త్‌, ఇంటర్‌లో 90శాతానికి పైగా మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ప్రభుత్వంతోపాటు గోపలాంటి సంస్థల సహకారంతో చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. ఆర్డీవో పులి మధుసూదన్‌గౌడ్‌ మాట్లాడుతూ కష్టపడే గౌడ విద్యార్థులకు గోప అండగా నిలవడాన్ని ప్రశంసించారు. గోప ప్రతినిధులు బండి సాయన్న, దుర్గపు రవీందర్‌గౌడ్‌, గుడాల రాజేష్‌గౌడ్‌, గుర్రం సత్యనారాయణగౌడ్‌, దుర్గపు శ్రీనివాస్‌గౌడ్‌, పోతుగంటి వెంకటేశ్వర్లుగౌడ్‌, సదాశివ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement