ప్రత్యేక మేనిఫెస్టోలు.. ఆకట్టుకునే హామీలు
మెట్పల్లి: ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతంత్రులు ప్రత్యేకంగా మేనిఫెస్టోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారు. మెట్పల్లి బల్దియాలో కాంగ్రెస్ రెబల్స్గా పోటీలో ఉన్న అభ్యర్థులు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు చర్చనీయాంశమయ్యాయి. ఓ వార్డులో ఓ అభ్యర్థి తాను గెలిచిన నెలలోపు 9 గ్యారంటీలు అమలుచేస్తానని ఇంటింటికి హామీ పత్రం అందిస్తున్నాడు. వార్డులోని పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి రూ.12వేలు, అంత్యక్రియల ఖర్చుకు రూ.5వేలు, దసరాకు హిందువులు, రంజాన్కు ముస్లిం మహిళలందరికీ చీరెలు అందిస్తానని, దుబాయ్, మస్కట్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే యువతకు ఉచితంగా వీసా, విమాన టికెట్లు ఇవ్వడం వంటి హామీలు ఇస్తున్నాడు. మరో వార్డులో కూడా ఓ అభ్యర్థి వార్డులోని ఆడపిల్ల వివాహానికి రూ.10,116 ఆర్థిక సహాయం, పేద పిల్లలకు ఉచితంగా విద్య, రవాణా సౌకర్యం, 24గంటలపాటు అంబులెన్స్ సౌకర్యం, పండుగల సందర్భంగా మహిళలకు చీరలు అందిస్తానని, సౌదీ, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధికి ఉచితంగా వీసాలు ఇవ్వడం తదితర హామీలతో ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.


