Delta Variant Cases Increase In China: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు - Sakshi
Sakshi News home page

143 కేసులు: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు

Aug 12 2021 2:57 PM | Updated on Aug 12 2021 5:19 PM

Videos Chinese Officials Locking People Inside Their Houses as Delta Variant Cases Surge - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్‌ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్‌ దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా, ప్రమాదకరంగా ఉండటంతో.. వైరస్‌ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనాలను బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో చైనా సోషల్‌ మీడియా యాప్‌ వీబోలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి.  

డెల్టా కేసులు ఎక్కువగా కనిపిస్తున్న వుహాన్‌లో ఈ తరహా చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయిని ఓ ట్విట్టర్‌ యూజర్‌ తెలిపారు. ఇక వీబో, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్‌లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్ల దగ్గరకు వెళ్లి.. వారిని లోపలకి పంపి.. బయట నుంచి తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్‌ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘జనాలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్‌ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్‌ ఓపెన్‌ చేయడం.. బయటకు రావడం చేస్తే వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తాం. ఇక ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్‌ చేస్తాం’’ అని తెలిపారు. 

ఇక ఆగస్టు 9 చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం తమ దేశంలోని 17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని తెలిపారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో వెలుగు చూడగా.. 108 స్థానికంగా నమోదయిన కేసులని తెలిపారు. ఇవేకాక నాన్‌జింగ్‌ సిటీలో మరో 48 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement