2030లోనే ఆ‌ వాహనాల అమ్మకాలపై బ్యాన్‌! | Sakshi
Sakshi News home page

2030లోనే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలపై బ్యాన్‌!

Published Sun, Nov 15 2020 2:22 PM

UK Plans To Ban Sale Of New Petrol And Diesel Cars From 2030 - Sakshi

లండన్‌:  పదేళ్ల తర్వాత బ్రిటన్‌లో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2030 నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాల అమ్మకంపై నిషేధం విధించనున్నట్లు వచ్చే వారం బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బ్రిటిష్‌ ప్రభుత్వం 2040 నుంచి వీటి అమ్మకాలపై నిషేధం విధించాలనుకుందట. అయితే గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బోరిస్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా సమాచారం. దీంతో ప్రధాని నిషేధం గడువు కాలాన్ని తగ్గించినట్లు అక్కడి ‍ఫైనాన్స్‌ టైమ్స్‌ మీడియా పేర్కొంది. పర్యావరణ విధానంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వాహనాల అమ్మకాల నిషేధాన్ని  2030కే అమలు చేయాలని నిర్ణయించినట్లు సదరు మీడియా పేర్కొంది. (చదవండి: బ్రిటన్‌ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత)

అయితే ఎలక్ట్రిక్‌, శిలాజ ఇంధన చోదక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని హైబ్రిడ్‌ కార్లకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, ఇంకా 2035 వరకు ఈ వాహనాలను విక్రయించవచ్చని స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త కార్ల అమ్మాకాల్లో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లు 73.6 శాతం ఉండగా ఖరీదైన ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు కేవలం 5.5 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలలో వెల్లడైంది. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!)

Advertisement
Advertisement