హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న అనుమానంతో గడిచిన నాలుగు రోజుల నుంచి చాలామంది వాహనాల ట్యాంక్లు ఫుల్ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరారు. వాహనాలతో పెట్రోల్ బంకులన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల సరఫరా చేయలేక సిబ్బంది చేతులెత్తేశారు. నాలుగు రోజులుగా పెట్రోల్ బంకుల ప్రాంగణాలు, రోడ్లన్నీ బారులుదీరిన వాహనాలతో కనిపించాయి. ఇదే అదునుగా కొంతమంది పెట్రోల్ బంకుల యజమానులు వాహననదారుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.
లక్డీకాపూల్లోని ద్వారకా సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంకు యజమాని గురువారం తన వద్ద 38 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉండగానే భారీగా వాహనదారులు వస్తారని గ్రహించి, మరో 8 వేల లీటర్ల ట్యాంక్ను తెప్పించారు. తీరా చూస్తే గురువారం మధ్యాహ్నం నుంచే వాహనదారులు రావడం తగ్గిపోయారు. మూడు రోజులుగా వచ్చినట్లు శుక్రవారం కూడా క్యూ కడతారని ఆశించిన పెట్రోల్బంకు యజమానికి నిరాశే ఎదురైంది. అప్పటికే నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్తో పాటు ట్యాంకర్ కూడా అలాగే ఉండిపోయింది.


