వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్‌! | Philippines Mindanao Earthquake Tsunami warning Latest News Updates | Sakshi
Sakshi News home page

వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్‌!

Jun 8 2026 6:38 AM | Updated on Jun 8 2026 7:14 AM

Philippines Mindanao Earthquake Tsunami warning Latest News Updates

ఒక్కసారిగా భూమి కంపించింది.. సముద్రం వైపు నుంచి ప్రమాద ఘంటికలు మోగాయి. ఫిలిప్పీన్స్‌ దక్షిణ ప్రాంతమైన మిండనావో సమీపంలో సంభవించిన 8.2 తీవ్రత భూకంపం ఆ దేశాన్ని వణికించగా, సునామీ హెచ్చరికలు జారీ కావడంతో వేలాది మంది తీరప్రాంత వాసులు భయాందోళనల మధ్య సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీప ప్రాంతాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రం ఉపరితలానికి అత్యంత సమీపంలో ఉండటంతో ప్రకంపనల తీవ్రత అధికంగా నమోదైంది.

మొదట ఈ భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన జీఎఫ్‌జెడ్‌.. అనంతరం దానిని సవరించి మరింత ఎక్కువగా నమోదు చేసింది. ఆపై 7.8గా, చివరకు 8.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.

భూకంపం అనంతరం అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ వెంటనే అప్రమత్తమై పసిఫిక్‌ మహాసముద్ర పరిసర తీరాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. దీనితో ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా జియోఫిజిక్స్‌ ఏజెన్సీ ఈశాన్య తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) ప్రకారం కొన్ని తీరప్రాంతాల్లో సాధారణ అలల ఎత్తుకంటే ఒక మీటర్‌కు పైగా సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. దీంతో దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రావిన్సుల్లో సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని లేదా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

భూకంపం కారణంగా భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రాణనష్ట, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నాయి.

ఇక భూకంపం తర్వాత బలమైన అనంతర ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్‌) సంభవించే అవకాశముందని PHIVOLCS హెచ్చరించింది. రాబోయే గంటలు, రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా తీరప్రాంతాల్లో సముద్ర మట్టం మార్పులను నిపుణులు నిరంతరం పరిశీలిస్తున్నారు. సునామీ ముప్పు పూర్తిగా తొలగే వరకు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. "భూమి కంపించింది.. ఇప్పుడు సముద్రం ఎలా స్పందిస్తుందన్నదే అందరిలో ఆందోళన కలిగిస్తోంది."

Advertisement
 
Advertisement
Advertisement