భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్‌! | Philippines Mindanao Earthquake Tsunami Warning Latest News Updates | Sakshi
Sakshi News home page

భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్‌!

Jun 8 2026 6:38 AM | Updated on Jun 8 2026 4:00 PM

Philippines Mindanao Earthquake Tsunami Warning Latest News Updates

ఒక్కసారిగా భూమి కంపించింది. క్షణాల్లో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రత భూకంపం వణికించగా.. ఇప్పుడు అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. ఎందుకంటే భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉపరితలానికి అత్యంత సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా నమోదైంది.

మొదట భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన అధికారులు.. ఆ తర్వాత 7.8గా, అనంతరం 8.2గా సవరించారు. దీంతో ఇది ఇటీవలి కాలంలో పసిఫిక్‌ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా మారింది.

కూలిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలు
భూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్‌, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఒకరు మృతి.. పలువురికి గాయాలు
తాజా సమాచారం ప్రకారం కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురికి పైగా గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. "ఇటీవలి సంవత్సరాల్లో మేము అనుభవించిన అత్యంత బలమైన భూకంపం ఇదే" అని స్థానిక అధికారులు తెలిపారు.

సునామీ భయం
భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్‌కు పైగా ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వేలాది మందిని తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండోనేషియా కూడా తన ఈశాన్య తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.

రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లోనే ప్రమాదం
ఫిలిప్పీన్స్‌ "పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌"గా పిలిచే అత్యంత భూకంప ప్రబల ప్రాంతంలో ఉంది. భూమి టెక్టానిక్‌ ఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.

ఇప్పుడు అందరి చూపు సముద్రంపైనే
భూకంపం వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు సునామీ ముప్పే అధికారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. సముద్ర మట్టంలో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగే వరకు తీరప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement