ఆఫ్ఘనిస్తాన్‌పై చర్చ: పాకిస్తాన్‌కు షాక్‌ | Pakistan regrets not being invited to UNSC discussion on Afghanistan | Sakshi
Sakshi News home page

UNSC Meet: అందని ఆహ్వానం.. పాక్‌ విచారం

Aug 9 2021 11:17 AM | Updated on Aug 9 2021 2:34 PM

Pakistan regrets not being invited to UNSC discussion on Afghanistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ) సమావేశానికి ఆహ్వానం అందకపోవడంపై పాకిస్తాన్‌ స్పందించింది. వివాదాస్పద పొరుగుదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై ఆగస్టు 6 న  నిర్వహించిన  భద్రతా మండలి సమావేశానికి  ఆహ్వానించకపోవడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆఫ్ఘన్‌​  పరిస్థితుల కారణంగా  తీవ్రంగా ప్రభావితమైన  పొరుగుదేశంగా  ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుకు రాకపోవడంపై పాకిస్తాన్ విచారం వ్యక్తం చేసింది. తాము చర్చలకు  సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహ్వానించలేదంటూ మండిపడింది. తమ దేశంపై తప్పుడు ప్రచారం జరగడానికి ఈ మండలిని వేదికగా ఉపయోగించుకుంటున్నారని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ దేశానికి తాము పొరుగునే ఉన్నామని, ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో తమది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.  ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని  రాజకీయ ఒప్పందమే  సరైనమార్గమంటూ  ఆయన ట్వీట్‌ చేశారు. దోహాలో జరిగిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యం వహించామని ఆశిస్తున్నట్టు  హఫీజ్ చౌదరి పేర్కొన్నారు. 

అటు తాలిబాన్లకు సురక్షితమైన స్వర్గధామం పాకిస్తాన్‌ మారిందని,వారికి  భారీమద్దతును అందిస్తోంటూ పాకిస్తాన్ పైఐరాసలోఆఫ్ఘన్ శాశ్వత ప్రతినిధి గులాం ఇసాక్ జై కూడా మండిపడ్డారు. మరోవైపు ఉగ్రవాదులకు ఊతమిస్తోందంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర‍్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలోని తీవ్రవాద సురక్షిత ప్రాంతాలను తక్షణమే నాశనం చేయాలని తద్వారా తీవ్రవాద గొలుసును అంతం చేయాలని ఐరాస భారత రాయబారి తిరుమూర్తి కోరారు.

కాగా నేడు (సోమవారం) సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. 15 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో  తీవ్రవాద నిరోధం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అంశాలతో పాటు ‘సముద్ర భద్రత’అంశాన్ని ఎజెండాలో ప్రత్యేక అంశంగా చర్చించడం ఇదే తొలిసారి. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాచారం ప్రకారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement