ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రకటన ప్రకారం.. కొనసాగుతున్న గల్ఫ్ చమురు సంక్షోభం, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా జరిగే సైనిక కవాతు, 31-గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. దాని బదులుగా, కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, శాఖలు ఈ సందర్భాన్ని నిరాడంబరంగా, గౌరవప్రదంగా పాటించాలని ఆదేశించారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన తీవ్ర ఇంధన సంక్షోభం, ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మార్చిలో పొదుపు చర్యలకు దిగిందని, వాటిలో భాగంగానే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.


