నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై నెలవారీ చెల్లింపులు కాకుండా 15 రోజులకోసారి రెండు దఫాలు జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది.
ఉద్యోగులకు 15 రోజులకు ఒకసారి జీతాలు చెల్లించడం ద్వారా వారి చేతుల్లో నెల మొత్తం డబ్బు ఉంటుందని, ఇది వారిని ఆర్థిక వ్యవస్థలో డబ్బును ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ విధానం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో కూడా సహాయపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించారు. పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు, రోజువారీ గృహ ఖర్చులు ఈ విధానం ద్వారా సులభతరం కానుంది. ఈ నిర్ణయం చిన్న వ్యాపారాలకు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కాగా 15 రోజులకోసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో అమలవుతోంది.


