అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులు | Iran launches missile attacks on US base in Qatar | Sakshi
Sakshi News home page

అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులు

Jun 24 2025 1:29 AM | Updated on Jun 24 2025 1:29 AM

Iran launches missile attacks on US base in Qatar

దోహా గగనతలంలో ఇరాన్‌ క్షిపణులు

ఖతార్‌లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులు

కువైట్, ఇరాక్, బహ్రెయిన్‌లోని యూఎస్‌ బేస్‌లపైనా దాడి జరిపినట్లు వార్తలు

ఆపరేషన్‌ బేషరత్‌ ఫతాహ్‌ పేరిట మిస్సైళ్లతో మెరుపుదాడి

వైట్‌హౌజ్‌ సిచ్యుయేషన్‌ రూమ్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్‌

ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ దాడుల పర్వం కొనసాగింపు

అంతకుముందే ముప్పేట దాడులుచేసిన ఇజ్రాయెల్‌

ఆరు ఇరాన్‌ సైనికవిమానాశ్రయాలపై ఇజ్రాయెల్‌ బాంబుల వాన

15 యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు నాశనం

ఇరాన్‌ను గొప్పగా మార్చలేని ప్రస్తుత ప్రభుత్వం అవసరమా? అని ప్రశ్నించిన ట్రంప్‌

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దోహా/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్‌ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. 

దోహా నగర సమీపంలోని అల్‌–ఉదేయిద్‌ అమెరికా ఎయిర్‌బేస్‌పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్‌ ‘ఆపరేషన్‌ బేషరత్‌ ఫతాహ్‌’ అని పేరుపెట్టింది. ఇరాక్‌లోని అయిన్‌ అల్‌ అసద్‌ బేస్‌పై ఇరాన్‌ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.

 తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్‌ రూమ్‌కు వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్సెత్, జాయింట్‌ చీఫ్స్‌ ఛైర్మన్‌ జనరల్‌ డ్యాన్‌ కెయిన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ట్రంప్‌ సమీక్ష జరుపుతున్నట్ల తెలుస్తోంది. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. 

తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ ప్రకటించాయి. అల్‌ ఉదేయిద్‌ ఎయిర్‌బేస్‌ నుంచి జూన్‌ 19వ తేదీలోపే కీలక యుద్ధ, ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదేయిద్‌ బేస్‌లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. గత పాతికేళ్లుగా దీనిని అమెరికా వాడుతోంది. ఈ బేస్‌పై దాడులు చేయబోతున్నట్లు ఖతార్‌ ప్రభుత్వానికి ఇరాన్‌ కొన్నినిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 పేలుళ్ల శబ్దాలు దోహా సిటీదాకా వినిపించాయి. దీంతో ఎవరూ బయటకు రావొద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీస్‌లకు ప్రభుత్వం వెంటనే  సందేశాలు పంపింది. ఆరుబయటకు రావొద్దని ఖతార్‌లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్‌ ఎంబసీలు  అడ్వైజరీలు జారీచేశాయి. ఖతార్‌ గగనతలాన్ని మూసేయడంతో దోహాసిటీకి వెళాల్సిన రెండు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు మార్గమధ్యంలో వెనుతిరిగాయి. కొచ్చి నుంచి మస్కట్‌కు అక్కడి నుంచి కన్నూర్‌కు తిరిగి వచ్చినట్లు ఎయిర్‌ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఖతార్‌లో తమ విమానమేదీ లేదని పేర్కొంది.

అమెరికా అండతో చెలరేగిన ఇజ్రాయెల్‌
అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబుదాడులు చేసి, అండగా ఉన్నానని అభయ హస్తమివ్వడంతో సోమవారం ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై చెలరేగిపోయింది. కారాగారం, మిలటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ప్రధాన కార్యాలయం, అణుకేంద్రం, ప్రభుత్వ ఆఫీస్‌... ఇలా ఇరాన్‌లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్డో పర్వతగర్భ యురేనియం శుద్ధి కర్మాగారంపై తన వంతుగా క్షిపణి దాడులు చేసి మరింత వినాశనానికి పాల్పడింది. వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటిరోజే ఇజ్రాయెల్‌ ఇదే న్యూక్లియర్‌ సెంటర్‌పై దాడులకు దిగింది.

 టెహ్రాన్‌లోని మిలటరీ కేంద్రాలపై ఏకంగా 50 యుద్దవిమానాలతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఆరు ఇరాన్‌ ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌లలో నిలిపి ఉంచిన ఎఫ్‌–15, ఎఫ్‌–5, ఏహెచ్‌–1 విమానం సహా 15 యుద్దవిమానాలు, హెలికాప్లర్లను ధ్వంసంచేసింది. రన్‌వేలపై బాంబులేసింది. టెహ్రాన్‌లోని పాలస్తీన్‌ స్క్వేర్, రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంపై, బసీజ్‌ వాలంటీర్‌ కోర్‌ భవనంపై దాడులు చేసింది. ఉత్తర టెహ్రాన్‌లోని ప్రముఖ మానవతా సంస్థ ‘ఇరానియన్‌ రెడ్‌ క్రిసెంట్‌’ భవనంపైనా ఇజ్రాయెల్‌ నిర్దయగా బాంబులేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ఇరాన్‌ సైతం దీటుగా బదులిచ్చింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌3’ పేరిట హైఫా, టెల్‌ అవీవ్‌ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ఉధృతం చేసింది. 

వ్యూహాత్మకంగా కారాగారంపై..
యుద్ధంలో సాయుధ బలగాలతోపాటు నిరాయుధ ఖైదీలుండే ఎవిన్‌ జైలు పైనా ఇజ్రాయెల్‌ గురిపెట్టింది. అయితే ఖైదీల గదులపై కాకుండా కారాగారం ప్రధాన ద్వారాన్ని బద్దలకొడుతూ డ్రోన్‌ దాడులుచేసింది. దీంతో గేటు తునాతునకలైంది. ఇరాన్‌ పాలకుల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుపాలైన ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను విడిపించేందుకే ఇలా డ్రోన్‌తో గేటును ధ్వంసంచేశారని తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని పడగొట్టడంపై ట్రంప్‌ దృష్టి
ఇరాన్‌ను ఏలుతున్న సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ రాజకీయవర్గాన్ని గద్దె దింపాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. సోమవారం ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘ ఇరాన్‌ను ప్రస్తుత ప్రభుత్వం గొప్ప దేశంగా అవతరింపజేయడంలో ఘోరంగా విఫలమైంది. ఇలాంటి విఫల ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది?’ అని ట్రంప్‌వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను ప్రభుత్వాన్ని కూల్చేఉద్దేశం తమకు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి హెగ్సెత్‌ మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్‌ ఇలా తన మనసులో మాట బయటపెట్టారు.

ఘర్షణ తగ్గేందుకు కృషిచేస్తానన్న పుతిన్‌
అమెరికా జోక్యం చేసుకోవడంతో రష్యా మద్దతు కూడగట్టేందుకు మాస్కోకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ప్రయత్నం కొంతమేర ఫలించింది. పశ్చిమాసియాను రణరంగం నుంచి శాంతిపథంలోకి పయనింపజేసేందుకు తన వంతు కృషిచేస్తానని, ఈ విషయంలో ఇరాన్‌కు సాయపడతానని పుతిన్‌ సోమవారం ప్రకటించారు. ‘‘ ఇరాన్‌పై దుస్సాహసంతో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులుచేశాయి. అణుబాంబు తయారీకి ఎలాంటి ఆధారాలు లేకున్నా, సరైన కారణాలు లేకుండా పశ్చిమాసియాను కదనరంగంగా మార్చేసి ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ ఒడంబడికల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డాయి’’ అని పుతిన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement