మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్‌ | India issues advisory for nationals in Israel W Asia | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్‌

Jun 8 2026 7:44 PM | Updated on Jun 8 2026 9:06 PM

India issues advisory for nationals in Israel W Asia

టెల్‌ అవీవ్‌: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాయం సూచించింది.

గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఇక ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.

ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్‌ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ మాత్రం రెండు ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్‌ బీరూట్‌ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఇజ్రాయెల్‌లోనూ.. 
టెల్‌ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్‌ అధికారులు, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్‌ అధికారులు, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.

అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.

భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.

తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement