భారీ వర్షాలతో థాయిలాండ్ అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
దక్షిణ థాయిలాండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 12 దక్షిణ ప్రావిన్సులలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో 145 మంది మృతి చెందారు. కేవలం సాంగ్లా ప్రావిన్సులోనే 110 మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భవనాలు నీటమునిగాయని.. వరదల దాటికి రోడ్లు కొట్టకుపోయాయని, తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. అయితే.. ఈ వరదల ప్రభావంతో 32 లక్షల మంది ప్రభావితం అయ్యారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు ప్రజల దైనందిన జీవితం దెబ్బతింది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో విపత్తు నిర్వహాణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.


