Elon Musk Says Twitter Will Change Logo From Bird to an X - Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ పక్షులకు వీడ్కోలు చెప్పేస్తా

Jul 24 2023 4:03 AM | Updated on Jul 24 2023 3:33 PM

Elon Musk says Twitter will change logo from bird to an X - Sakshi

న్యూయార్క్‌:  ట్విట్టర్‌.. ఈ సోషల్‌ మీడియా వేదిక గురించి తెలియని నెటిజన్లు ఉండరు. నీలి రంగు ట్విట్టర్‌ పిట్ట అందరికీ సుపరిచితమే. ఈ పిట్ట ఇకపై కనిపించదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ యజమాని, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రకటించారు. తమ యాప్‌ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. ట్విట్టర్‌ను రీబ్రాండ్‌ చేయనున్నట్టు తెలియజేశారు. చైనాకు చెందిన వియ్‌చాట్‌ తరహాలో అన్నింటికీ పనికొచ్చే ‘ఎక్స్‌’ యాప్‌ను రూపొందించాలని ఆయన కొంత కాలంగా యోచిస్తున్నారు. ఇది కేవలం సోషల్‌ మీడియా వేదికగానే కాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి పనికొస్తుంది.

చాలా రకాల సేవలు అందించేలా ఎక్స్‌ యాప్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్‌ను త్వరలో ‘ఎక్స్‌’ యాప్‌గా రీబ్రాండ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘త్వరలోనే మేం ట్విట్టర్‌ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా నీటి రంగు ట్విట్టర్‌ పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం’ అని ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ యాప్‌నకు కొత్త లోగోను సూచించాలని ఆయన కోరారు. ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సంస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ బిజినెస్‌ పేరును ఎక్స్‌ కార్పొరేషన్‌గా మార్చారు. ట్విట్టర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ కార్పొరేషన్‌లో చట్టబద్ధంగా విలీనమైంది.

Advertisement
 
Advertisement
Advertisement