న్యూయార్క్: కెనడాలోని టంబ్లర్ రిడ్జ్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా విడుదల చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్కూల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు జెస్సీ వాన్ రూట్సెలార్ (18) ఖాతాను తాము 2025లోనే గుర్తించి, నిలిపివేసినట్లు సంస్థ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఏడాది జూన్ నెలలోనే జెస్సీ వాన్ రూట్సెలార్ ఖాతాను తమ ‘అబ్యూస్ డిటెక్షన్ సిస్టమ్’ ద్వారా గుర్తించినట్లు తెలిపింది.
నిందితుడు హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఏఐని వాడుతున్నట్లు ఓపెన్ ఏఐ గుర్తించింది. దీనిపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించిన సంస్థ నిందితుని ఖాతాను 2025 జూన్లో నిషేధించింది . అయితే ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని భావించినప్పటికీ, అతని కార్యకలాపాలు తక్షణ ప్రమాదాన్ని సూచించే స్థాయిలో లేవని భావించి వెనక్కి తగ్గినట్లు సంస్థ పేర్కొంది. శాంతిభద్రతల విభాగాలకు సమాచారం ఇచ్చే విషయంలో తమకంటూ కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయని ఓపెన్ ఏఐ వివరించింది.
ఘటన జరిగిన తరువాత ఓపెన్ ఏఐ ప్రతినిధులు కెనడా అధికారులను కలుసుకుని, నిందితుడు చాట్జీపీటీని ఎలా ఉపయోగించాడనే వివరాలను తెలియజేశారు. ఈ విషయాన్ని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ స్టాఫ్ సర్జెంట్ క్రిస్ క్లార్క్ వెల్లడించారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు జెస్సీ తొలుత తన తల్లిని, సవతి సోదరుడిని ఇంట్లోనే హతమార్చి, అనంతరం సమీపంలోని పాఠశాలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక టీచింగ్ అసిస్టెంట్తో పాటు ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.


